న్యూఢిల్లీ, డిసెంబర్ 05 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే పెరుగుతున్న నిత్యావసర ధరలను ప్రస్తావిస్తూ రాహుల్ తన ట్విటర్ ఖాతాలో.. ధరలు ఎంత శాతం పెరిగాయో ఓ టేబుల్ ద్వారా వివరిస్తూ అందులో ఒక పొరపాటు చేశారు. విషయమేమిటంటే.. ఇటీవల ఉల్లి, టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో 2014 నుంచి 2017 వరకు నిత్యవసర సరకుల ధరలు ఎంత శాతానికి పెరిగాయో వివరిస్తున్న రాహుల్.. కందిపప్పు ధర విషయ౦లో కాస్త పప్పులో కాలేశారు. కిలో కందిపప్పు రూ.45 నుంచి రూ.80కి పెరిగిందని వివరిస్తూ 77 శాతానికి బదులు 177 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఇంకేముంది ఈ విషయ౦పై నెటిజన్ల నుండి కామెంట్లు గుప్పుమన్నాయి. కాబోయే అధ్యక్షుడికి లెక్కలు కూడా సరిగా రావా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.