హైదరాబాద్, డిసెంబర్ 03 : ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా బ్యూటీ తాప్సీ టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ మధ్య తెలుగులో ‘ఆనందో బ్రహ్మ’తో ప్రేక్షుకులను అలరించారు. తాజాగా తను తెలుగులో నటించబోయే తదుపరి చిత్రాన్ని ఆదివారం ప్రకటించారు. ‘అభిమానులకు మాటిచ్చిన ప్రకారం, నా కొత్త తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరో వినోదాత్మక సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇందులో ఆది పినిశెట్టి కథానాయకుడిగా, తాప్సీ హీరోయిన్ గా నటించనున్నారు. గతంలో ఆది, తాప్సి ఇద్దరు కుమార్ నాగేంద్ర దర్శకత్వం లో వచ్చిన ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో నటించిన సంగతి విధితమే. ఈ సినిమాకు ‘లవర్స్’ సినిమా ఫేం హరి దర్శకత్వం వహిస్తుండగా, ‘గీతాంజలి’ మూవీని తెరకెక్కించిన కోనా వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.