గుంటూరు, డిసెంబర్ 03: గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాతీయ స్థాయి నృత్య పోటీలు జరిగాయి. శనివారం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా కూచిపూడి నృత్యాలు, ఆ తర్వాత దేశీయ జానపద నృత్యాలు ప్రదర్శితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు యువతీ యువకులు, బాలలు, పోటాపోటీగా నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. రాధామాధవ రసరంజని 256వ నెలనెలా వెన్నెల కార్యక్రమాలలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలలో ఇవి రెండోరోజు నాటి పోటీలను రాధామాధవ రసరంజని వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య షేక్.ఖలీల్, అరుణ పర్యవేక్షించారు. అందరికీ పరిచయమైన అలరులు కురియగ ఆడెనదే, భామా కలాపం, వచ్చెను అలమేల్మంగ, గణపతి స్తుతి, పుష్పాంజలి అర్ధనారీశ్వరం, కృష్ణం కలయసఖి సుందరం తదితర కీర్తనలు తరంగాలకు అనుగుణంగా నృత్యాభినయాలు సాగాయి. రాత్రి పది గంటల దాటాక జానపద నృత్య పోటీలను నిర్వహించారు. దేశీయ జానపదాలైన మామ బంగారి మామ, నీలినీలిమబ్బుల్లోన, కైకలూరు చిన్నదాన్ని, నా అందం చూడు మామయ్య తదితర జానపద పాటలకు 17 మంది హుషారుగా నృత్యాభినయాలు చేసి చూపరుల ప్రశంసలందుకొన్నారు.