హైదరాబాద్, డిసెంబర్ 03 : మెట్రో.. ప్రారంభమై వారం గడవలేదు. అసలే ప్రయాణికుల౦దరికి ఈ మెట్రో ప్రయాణం ఒక కొత్త అనుభూతే. ఇంకా ఎవరికి ఏ స్టేషన్ ఎక్కడుంటుందో సరిగా తెలియదు, ఎక్కడ ఎక్కాలో తెలీని పరిస్థితి. ఇక మెట్రో స్టేషన్ లో అనౌన్స్మెంట్ కూడా సరిగ్గా లేకపోతే ప్రయాణికులు గందరగోళానికి గురి కావాల్సిందే. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అమీర్పేట నుంచి నాగోల్ బయలుదేరిన మెట్రో రైల్ కోచ్ నెం.డీబీ003లో అమీర్పేట్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నుంచి బయలుదేరి ముందు ఆగనున్న స్టేషన్కు బదులుగా ఆ తరువాత వచ్చే రెండో స్టేషన్ పేరును తెలుపుతూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు కాస్త అయోమయానికి గురయ్యారు. ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రయాణికులు.. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు.