అమరావతి, డిసెంబర్ 2: మరో క్రీడకారుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించింది. భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్కు ఈ హోదాను ఆమోదించింది. ఈ ఏడాది కిదాంబి శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ను కైవసం చేసుకున్నాడు. జూన్లో ఇండోనేషియా ఓపెన్తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్ అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్, ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్లు నెగ్గి ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు డిసెంబరు 13 నుంచి 17 వరకు దుబాయ్లో జరిగే బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్కు శ్రీకాంత్ అర్హత సాధించాడు. తన కెరీర్లోనే అత్యుత్తమంగా ఈ ఏడాది ప్రపంచ పురుషుల సింగిల్స్లో ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్ళాడు. శ్రీకాంత్ అసాధారణ ప్రతిభకు శనివారం శాసనసభ డిప్యూటీ కలెక్టర్ హోదాకు ఆమోదం తెలిపింది. గతంలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ హోదా కల్పించిన సంగతి తెలిసిందే.