హైదరాబాద్, డిసెంబర్ 02 : గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేపడుతోంది. మిషన్ కాకతీయ పునరుద్ధరణ నాలుగో దశను ప్రారంభించడానికి సిద్దమవుతోంది. పాత పది జిల్లాల పరిధిలో 5,510 చెరువులకు పైగా పనులు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం, 92 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ చెరువులలో అత్యధికంగా పాత మెదక్ జిల్లా పరిధిలో 1466 చెరువులకు, జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో 19 చెరువులకు మరమత్తులు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణాలకు మొదటి దశ అనుమతిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండోదశ అనుమతులకు సంబంధించిన పనులు ప్రారంభించాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు తెలిపారు.