అమరావతి, డిసెంబర్ 02 : అసెంబ్లీ చర్చల్లో భాగంగా కాపులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంపూర్ణంగా అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ... 2014లో ఇచ్చిన హామీకి కట్టుబడి కాపులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి 2016లో జస్టిస్ మంజునాథ కమిషన్ వేశామని చంద్రబాబు చెప్పారు. బీసీ కమిషన్ అన్ని జిల్లాల్లో తిరిగి కాపుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అని చంద్రబాబు అన్నారు. బీసీలు లేకుండా తెదేపా లేదని స్పష్టం చేశారు. బీసీలను ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు బడ్జెట్లో రూ.10వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.