న్యూఢిల్లీ, డిసెంబర్ 01 : మాజీ ఆర్థికమంత్రి చిదంబరం బంధువుల ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేటి ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. 2006లో జరిగిన ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్సెల్లో 80మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3500కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి మారిషస్కు చెందిన మ్యాక్సిస్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే రూ. 600కోట్ల పైబడిన విదేశీ పెట్టుబడులకు ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉండగా, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సొంతంగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై కేసు నమోదైన తరువాత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపైనా కూడా ఆరోపణలు రావడంతో, చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో, కోల్కతాలోని రెండు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి ఈ మేరకు సోదాలు నిర్వహించారు.