నగర పోలీసులకు సీఎం కేసీఆర్ హర్షం

SMTV Desk 2017-11-30 18:43:16  CM KCR, Police, hyderabad

హైదరాబాద్, నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీఈఎస్, మెట్రో రైల్ ప్రారంభోత్సవం కార్యక్రమాలను అన్ని ప్రభుత్వ శాఖలు దిగ్విజయంగా పూర్తి చేశాయని హర్షం వ్యక్తం చేశారు. జీఈఎస్ సదస్సు ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. ..దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో, అత్యంత హుందాగా పోలీస్‌శాఖ పనిచేసిందన్నారు. ఈ మేరకు పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ కేంద్రం నుంచి సందేశం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. పోలీసులు సమన్వయం, టీం స్పిరింట్‌తో పని చేసి తెలంగాణ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేశారు. ఒకే రోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తించారని సీఎం వారికి కితాబిచ్చారు. తెలంగాణ పోలీసులు అత్యున్నత ప్రమాణాలతోపాటు హుందాగా వ్యవహరించారు. రాష్ట్ర పోలీసులను అమెరికా సీక్రెట్ ఏజెన్సీ, కేంద్ర హోంశాఖ, నీతి ఆయోగ్, వివిధ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, అధికార యంత్రాంగానికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. పోలీసులు ముందస్తు ప్రణాళిక, వ్యూహం ప్రకారం పనిచేయడంతో ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరుగలేదన్నారు. తనిఖీల పేరుతో అతిథులను ఇబ్బంది పెట్టకుండానే కావాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అందరినీ సమన్వయం చేస్తూ అతిపెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సీఎం వెల్లడించారు.