హైదరాబాద్, నవంబర్ 29 : హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రాజీనామా చేశారనే వార్తలు రావడంతో ఆయన దీన్ని తీవ్రంగా ఖండించారు."నగర ప్రథమ పౌరుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కారణంతోనే సర్కారు శిలాఫలకంలో స్థానం ఇవ్వలేదు. ఇదే విషయమై తీవ్ర అసంతృప్తికి గురైన మేయర్ రాజీనామాకు సిద్ధమయ్యారు" మంగళవారం ఉదయం నుంచి వాట్సప్, ఫేస్బుక్లో వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన రామ్మోహన్ సైబర్క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై కక్షతో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారన్నారు. వారం క్రితం కూడా "ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు మేయర్ను ఆహ్వానించలేదు. నగరానికి ఇది అవమానకరం" అంటూ ఇలానే వార్తలు గుప్పుమన్నాయని నేర విభాగం అదనపు కమిషనర్ రఘువీర్కు మేయర్ వివరించారు. అంతేకాకుండా మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గౌరవించిందని, ప్రధానికి ఘనంగా స్వాగతం పలికానని రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.