ఓ ముఖ్యనేత వస్తే వైసీపీ ఖాళీ: అచ్చెన్నాయుడు

SMTV Desk 2017-11-28 16:58:15  achennayudu, ycp, emty, andhrapradesh

అమరావతి, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 23 మంది విపక్ష వైసీపీ ఎమ్మెల్యే లను తమ పార్టీలో చేర్చుకున్న టీడీపీ తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేసింది. వైసీపీలో ఉన్న ఓ ముఖ్య నేత కోసం తాము వేచి చూస్తున్నామని... అదే జరిగితే వైసీపీ దుకాణం ఖాళీ అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్ పాదయాత్ర ముగిసే నాటికి వైసీపీ ఖాళీ అవుతుందని, అందులో ఆయన తల్లి, చెల్లి, కొద్ది మంది బంధువులు మాత్రమే ఉంటారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. టీడీపీలోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి చేరితే రాజ్యసభలో అభ్యర్థిని నిలిపే బలం కూడా ఆ పార్టీకి ఉండదని ఆయన అన్నారు. జగన్ ను ప్రజలు నమ్మడం లేదని, ఆయన రాజకీయాలు మాని వ్యాపారాలు చూసుకోవడం మంచిదని మంత్రి సలహా ఇచ్చారు. కాగా రాజ్యాంగ విరుద్దంగా నాయకులను డబ్బులు ఇచ్చి కొనడం ఏంటని, ఇది ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో టీడీపీ కి బుద్ధి చెప్తారని వైసీపీ విమర్శించింది.