పుట్టపర్తి, నవంబర్ 28 : ప్రమాదం నుంచి ఆర్టీసీ బస్సు, అందులోని ప్రయాణికులు బయటపడిన ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్ వద్ద జరిగింది. గోరంట్ల-పుట్టపర్తి మార్గంలో ద్విచక్రవాహనదారుడు ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనబోయాడు. దీంతో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ను పక్కకు తిప్పడంతో, బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొని సమీపంలోని బావి వద్దకు దూసుకెళ్లింది. బస్సు 30 అడుగుల లోతున్న బావిలోకి ఒరిగినప్పటికీ డ్రైవర్ చాకచక్యంతో, వ్యవహరించి బ్రేకులు గట్టిగా వేసి ఆపగలిగాడు. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అరగంట వరకు అలాగే బస్సును నియంత్రించిన తర్వాత పోలీసులు, స్థానికులు ప్రయాణికులను నెమ్మదిగా కిందకి దించారు. ఈ ప్రమాదంలో ఓ పాదచారుడు అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.