హైదరాబాద్, నవంబర్ 28: గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హాజరు కానున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా, ప్రధాని నరేంద్ర మోదీ, కెసిఆర్ లతో పాటు 170దేశాల నుండి వచ్చిన 1500 మంది అతిధులకు ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందుకు భద్రత, హైదరాబాద్ పోలీసులకు కత్తిమీదసాములా మారింది. సాయంత్రం 5 గంటలకు మొదటిరోజు సదస్సు ముగింపు అనంతరం 7.30 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఈ విందుకు తొలుత నరేంద్ర మోదీ కాన్వాయ్, ఆ తరువాత ఇవాంకా కాన్వాయ్, ఆపై కేసీఆర్, కేంద్ర మంత్రుల కాన్వాయ్ లను అనుమతించి, అటు పిమ్మట అతిథులను తీసుకువెళ్లాలని పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. మాదాపూర్ నుండి ఫలక్ నుమా ప్యాలెస్ కు దాదాపు 30 నిమిషాల సమయం పట్టనుంది, సాయంత్రం 6 నుండి 8 వరకు, రాత్రి 9 నుండి 11 గంటలవరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఖాయం. అతిథులను ఫలక్ నుమాకు తరలించేందుకు 45 బస్సులను సైతం ఏర్పాటు చేశారు.