అహ్మదాబాద్, జూన్ 13 : గుజరాత్లోని ఆమ్రేలీ పట్టణంలో సోమవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అదే కార్యక్రమంలో మొదటి వరుసలో నిలబడిన కేతన్ అనే 20 ఏళ్ల యువకుడు.. స్మృతి ఇరానీ మాట్లాడుతుండగా ఆమెపై గాజులు విసిరి వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటుండగా స్మృతి కేతన్ని వదిలిపెట్టమని ఆదేశించారు.అతను ఎన్ని గాజులు విసిరినా పట్టించుకోవద్దని కార్యక్రమం అయ్యాక ఆ గాజులను కేతన్ భార్యకు కానుకగా పంపిస్తానని చమత్కరించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేసిన నేపథ్యంలో, గుజరాత్ ప్రభుత్వం కూడా అలాగే చేయాలని కోరుతూ ఆ యువకుడు గాజులు విసిరాడని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.