అమరావతి, జూన్ 13: సమాజానికి అవసరమైన చట్టసవరణలపై చట్టసభల్లో సమగ్ర చర్చ జరగడం లేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. ఆర్ధిక, విద్యుత్ సంస్కరణలు పేదల జీవన ప్రమాణాలను పెంచేవిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యుత్ ప్రమాద మృతులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) కొత్త నిబంధనావళిని రూపొందించింది. ఈ రెగ్యులేషన్ను విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదాల్లో బాధితులకు సరైన పరిహారం అందజేయడం మానవ ధర్మమన్నారు. ఏ సంస్కరణలైనా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, అయితే చట్టసవరణలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రయోజనాలను గుర్తించి, వారి అభిమతం, ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.