రంగారెడ్డి, జూన్ 13 : ప్రభుత్వ భూమి 700 ఎకరాల భూకుంభకోణం వెలుగు లోకి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రశ్నించారు. మియాపూర్ ప్రభుత్వ భూముల కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించి సీఎం కేసీఆర్ తన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తే కేసును నీరుగార్చినట్లేనన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో మియాపూర్ భూ కుంభకోణం నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అండదండలతోనే గోల్డ్స్టోన్ ప్రసాద్ ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమాల్లో సీఎం పేషీలోని ఆయన సమీప బంధువు కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంసెట్ లీకేజీ, నయీమ్ కేసులను అట కెక్కించిన సీఎం.. తాజాగా మియాపూర్ భూముల వ్యవహారాన్నికూడా పక్కన పేట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మియాపూర్ భూ కుంభకోణం రూ.15 వేల కోట్లని, ఇవే కాకుండా.. మణికొండలోని కాందీశీకుల భూములనూ కాజేశారన్నారు. ఈ కేసును సీబీఐ అప్పగించి న్యాయ నివేదిక రాకుంటే టీటీడీపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.