గాంధీనగర్, నవంబర్ 22: గుజరాత్ లో తమ ప్రధాన శత్రువు బీజేపీ ని ఓడించడానికి కాంగ్రెస్ కే తమ మద్దతు ఇస్తామని పటేళ్ల రిజర్వేషన్ పోరాట సమితి నేత హార్దిక్ పటేల్ తెలిపారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, పటేళ్ల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో హార్దిక్ పటేల్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ తమ షరతులకు ఒప్పుకుందని, పటేళ్లకు రిజర్వేషన్ కల్పించేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామని కాంగ్రెస్ చెప్పినట్లు హార్దిక్ వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని కూడా కోరామని ఆయన వెల్లడించారు.