హైదరాబాద్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్ధి బడిబాట వైపుకు వెళ్లేందుకు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం కోసం ఉద్దేశించి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈనెల 17 వరకు పెద్దఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జి. కిషన్ విడుదల చేశారు. అందులో భాగంగా తొలి రోజు మన ఊరు-మన బడిబాట సర్వే అనే కార్యక్రమంలో ఈ బడిబాటను ప్రారంభించనున్నారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించడానికి డోర్ టు డోర్ సర్వే నిర్వహించనున్నారు. ఆ బాధ్యతలను ప్రతి ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ఆంగ్ల మాధ్యమం బడుల గురించి గ్రామాల్లో ప్రచారం చేస్తూ గ్రామాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్ధుల నమోదు ప్రక్రియ నిర్వహిస్తారు.