న్యూ ఢిల్లీ, జూన్ 12 : దేశ భద్రతపై భంగం కలిగే అవకాశాలు ఉండవచ్చు అంటున్న ఏజెన్సీ, నకిలీ ఆధార్ కార్డు కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ఇండియా (యూఐడీఏఐ) నిరాకరించింది. అలాగే దీంతో పాటు నకిలీ కార్డుల కేసులో ఇప్పటివరకు చేపట్టిన చర్యల వివరాలను తెలిపేందుకు సైతం వీలుకాదని అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్ కు ఏజెన్సీ సమాధానమిస్తూ.. నకిలీ ఆధార్ కార్డుల కేసుల వివరాలను వెల్లడిస్తే దేశ భద్రతకు భంగం కలుగవచ్చునన్నారు. ఈ తరహా అక్రమాలకు పాల్పడేందుకు మరింత మందికి ప్రేరణ కల్పించినట్లువుతుందని ఏజెన్సీ పేర్కొంది. 12 అంకెల వినూత్న నంబర్ తో కూడిన ఆధార్ కార్డు వ్యక్తిగత, చిరునామా ధృవీకరణగా పనిచేయడంతో పలు అనధికార వెబ్ సైట్లు ఆధార్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయని ఫిర్యాదులు పలువురు చేసారని తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు కనీసం 8 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దేశ భద్రత విషయంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలపై తగు సూచనలు చేసారు.