ముంబై, నవంబర్ 19 : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడంతో పాటు, ప్రజలను నగదు రహిత లావాదేవీలకు మళ్లించడంలో చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలును సాధించాయి. తాజాగా మార్కెట్ లో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు రూ.74,090 కోట్లకు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే 84 శాతం పెరుగుదల నమోదైందని ఐరోపా చెల్లింపు సేవల సంస్థ వరల్డ్లైన్ అధ్యయనం వెల్లడించింది. దీనికి ముఖ్యకారణం డీమోనిటైజేషన్, ప్రభుత్వ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే అని తెలిపింది. నోట్ల రద్దు తర్వాత ప్రతి ఒక్కరు తమ కొనుగోలు ను నగదు రహితంగా చేశారని, సెప్టెంబర్లో అన్ని పీఓఎస్ యంత్రాల వద్ద 37.8 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, గతేడాది తో పోలిస్తే 86 శాతం వృద్ధి కనిపించిందని వరల్డ్లైన్ దక్షిణాసియా ప్రతినిధి దీపక్ చంద్నాని తెలిపారు. జన ధన్ యోజన ఖాతాల వల్ల కార్డులు వినియోగం బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఇంతక ముందు ఆర్బీఐ నోట్ల రద్దు తర్వాత గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్కు డిజిటల్ లావాదేవీల్లో 31 శాతం పెరుగుదల ఉందని చెప్పిన విషయం తెలిసిందే.