పట్నా, నవంబర్ 18: బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ చాలా సాధారణంగా తన కొడుకు పెళ్లి చేస్తున్నారు. అంతే కాదండోయ్ వివాహ పత్రికల్లో వరకట్నం తీసుకోవడం లేదని కూడా రాయించారు. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహం డిసెంబరు 3న జరగనుంది. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉత్కర్ష్ కోల్కతాకు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ యామినిని వివాహం చేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి ఎటువంటి హడావుడి, హంగామా లేకుండా సుశీల్కుమార్ మోదీ చేస్తున్నారు. వివాహ వేడుకకు ఆహ్వానం కూడా వాట్సాప్, మెయిల్ ద్వారా పంపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా ఈ-కార్డులే పంపించారు. రెండు గంటల్లో పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించనున్నారు. వచ్చిన అతిథులకు ఎటువంటి భోజన ఏర్పాట్లు కూడా లేవు. కేవలం ప్రసాదం మాత్రమే పంచిపెట్టనున్నారు. ఎటువంటి విందు, నృత్యం, బరాత్ లేకుండా చాలా సాధారణంగా చేస్తున్నారు. అంతేకాదు కట్నం తీసుకోవడం లేదనే విషయాన్ని చెప్పేందుకు చాలా గర్వపడుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఇలా చేసి ఎంతోమంది నేతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. వరకట్న వేధింపుల కారణంగా ఎంతో మంది యువతులు బలైపోతున్న కారణంగా వరకట్నం నిషేధిస్తున్నట్లు సీఎం నితీశ్కుమార్ గతంలోనే ప్రకటించారు. కట్నం తీసుకోని వాళ్లే తనను పెళ్లికి పిలవాలని కూడా సీఎం పేర్కొన్నారు.