ఇటానగర్, నవంబర్ 18 : మనం నిర్మాణాల కోసం ఉపయోగించే సిమెంట్ బస్తా ధర సాదారణంగా రూ. 300 నుండి రూ.400 వరకు ఉంటుంది. కానీ అరుణాచల్ప్రదేశ్లోని విజోయ్నగర్లో మాత్రం ఒక సిమెంట్ బస్తా వెల అక్షరాల రూ. 8000... నమ్మలేకపోతున్నారా..! కానీ ఇది పచ్చి నిజం.. చాంగ్లాంగ్ జిల్లాలో గల విజోయ్నగర్ లో జనాభా కేవలం 1500 మంది మాత్రమే. అక్కడి నుంచి సమీపంలోని మరో పట్టణానికి వెళ్లాలంటే ఐదు రోజుల పాటు కాలినడకన వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో కేంద్రప్రభుత్వం సహకారంతో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో మరుగుదొడ్డికి కేంద్రం రూ. 10,800 ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,200 అందిస్తుంది. అయితే ఈ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మాణం కష్టమవుతుందని అక్కడి అధికారులు వాపోతున్నారు. మెటీరియల్ రావడానికి ఐదురోజుల సమయం పడుతుందని, దాదాపు 156 కిలోమీటర్లు నడిచి వీటిని మోసుకొస్తున్నారని జూనియర్ ఇంజినీర్ జుమ్లీ తెలిపారు.