అమరావతి, నవంబర్ 18: దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నివిధాల దూసుకుపోతోందని, సింగపూర్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సమావేశం సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు సింగపూర్ ముఖద్వారంగా వుందని, అక్కడ అమలు చేసే ఉత్తమ విధానాల్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని పేరుతో ఒక కాంక్రీట్ జంగిల్ నిర్మించాలనుకోవట్లేదని, ఇక్కడి సహజసిద్ధమైన వనరుల్ని ఉపయోగించుకుంటూనే ఆధునిక టెక్నాలజీతో అద్భుత రాజధాని నిర్మించాలనేది తమ ప్రయత్నమని తెలిపారు. రాబోయే రోజుల్లో అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. త్వరలో 1,500 ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నామని, అమరావతిని ప్రపంచ ఉత్తమ శ్రేణి నగరాల్లో ఒకటిగా నిర్మించడం తన జీవిత లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.