డెహ్రాడూన్, నవంబర్ 16 : భారత్ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా ఒక కారు కొనుక్కొని విమర్శలకు గురైయ్యాడు. చాలా మంది ప్రముఖులు పన్ను పరిధి తగ్గించుకోవడం కోసం ఇతర రాష్ట్రంలో కార్లు, బస్సులు కొంటుంటారు. ఇప్పుడు రైనా కూడా అదే కోవలోకి చేరాడని విమర్శకుల వాదన... వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్కు చెందిన క్రికెటర్ తాజాగా ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో విలాసవంతమైన మెర్సిడేజ్ బెంజ్ జీఎల్ఈ 350 డీ కారు కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు రూ.80లక్షలు. యూపీలో రూ.10లక్షలకు పైగా విలువైన వాహనాలు కొనుగోలు చేస్తే 10శాతం పన్ను కట్టాలి. అదే ఉత్తరాఖండ్లో అయితే అది 8శాతం మాత్రమే. పన్ను తగ్గించుకోవడం కోసమే రైనా అక్కడ కారు కొన్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై రైనా స్పందిస్తూ " నాకు నచ్చిన రంగు నీలం కారు ఇక్కడ దొరకలేదు. కావున డెహ్రడూన్లో కొనుగోలు చేశా" అని చెప్పారు. ఈ మధ్య సినీ నటి అమలపాల్ పై కూడా కారు రచ్చఇలానే కొనసాగింది.