హైదరాబాద్, జూన్ 11 : సీఎం కేసీఆర్.. ఓ కాలజ్ఞాని అని, దూరదృష్టి కలిగిన పరిపాలనా దక్షుడని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వెల్లడించారు. ఎంచుకున్న రంగంలో రాణించాలన్న కసితోపాటు కృషి ఉంటే ఫలితం వస్తుందని, ఇందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదాహరణ అని పేర్కొన్నారు. శనివారం తన బాల్యమిత్రుడు, ఓఎస్డీ, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పీహెచడీ స్కాలర్స్ రూపొందించిన ‘పర్సెప్టివ్ ఆన తెలంగాణ ఎకానమీ’ పుస్తకాన్ని స్పీకర్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నా జీవితంలో నేను ఇద్దరు కాలజ్ఞానులను చూశాను. అందులో ఒకరు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, మరొకరు సీఎం కేసీఆర్. సంపదను గుర్తించి దోచుకోవాలని చూసే ఆంధ్రులను అమాయకులైన తెలంగాణవాళ్లను ఒక్కటిగా కలపొద్దని జయశంకర్ తన 15వ ఏటనే గుర్తించారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించినపుడు తెలంగాణ ఏ విధంగా రాబోతోందో కేసీఆర్ అన్ని దశలనూ వివరించారు. ఆయన చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర కల మన ముందు ప్రత్యక్షంగా సాకారమయిందన్నారు.