అమరావతి, నవంబర్ 14 : విశాఖలో 50 వేల ఇళ్ళ నిర్మాణానికి పట్టాలు అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ చర్చలలో భాగంగా ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు మాట్లాడుతూ.. సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో మరో 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్ధీకరించాల్సి ఉందని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో జరిగే అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందుకోసం ఏడాదికి మూడు సార్లు గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని సభకు వివరించారు. పట్టణాల్లో 5,39,586 ఇళ్లు కడుతున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో మరో 13,06,555 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి 18,45,841 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉండగా, 19 లక్షల ఇళ్లను నిర్మించి ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.