హైదరాబాద్, నవంబర్ 14 : పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు, మెదక్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పురపాలక చైర్మన్లు, కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పురపాలక సంఘానికి రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుందని, పురపాలక సంఘాల్లో సిబ్బంది కొరత సమస్యను అధిగమించేందుకు నియామక ప్రక్రియ కూడా జరుగుతున్నట్లు తెలిపారు. 15వేల జనాభా దాటితే నగర పంచాయతీలుగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 30 జిల్లా కేంద్రాలు, పట్టణాభివృద్ధి అథారిటీలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని.. అలాగే సిద్దిపేట పురపాలక సంఘంతో పాటు మరో 13 గ్రామాలతో సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) ఏర్పాటవుతున్నందున మాస్టర్ప్లాన్ ఆమోదానికి పంపాలని కోరారు.