అమరావతి, నవంబర్ 09 : వైసీపీ నేతలు ఏపీ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకు వినతి పత్రాన్ని అందించారు. వైసీపీ నుండి గెలుపొంది టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ విషయంపై స్పందించిన స్పీకర్.. ఫిరాయింపు కారణం చూపుతూ వైసీపీ నేతలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని చెప్పడం సరికాదు. వారంతా ఎన్టీఆర్ ను స్పూర్తిగా తీసుకున్నామంటున్నారు. ఎన్టీఆర్ ఒక్కరే అసెంబ్లీని బహిష్కరించారని మిగతా ఎమెల్యేలంతా సమావేశాలకు హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యల విషయంపై వారంతా ముందే హైకోర్టును ఆశ్రయించారని, అక్కడ పిటీషన్ కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన సుప్రీం కోర్టు రాజ్యంగా ధర్మాసనానికి పంపిందని వెల్లడించారు. కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఈ విషయంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోగలనని ప్రశ్నించారు.