సిమ్లా, నవంబర్ 08 : ఈ నెల 9న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పోలింగ్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 337 మంది అభ్యర్ధులుఉండగా, శాసనసభలో 68 స్థానాలు మాత్రమే ఉన్నాయి. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 50.25లక్షల మంది ఉన్న ఈ రాష్ట్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం 7,525 పోలింగ్ కేంద్రాలతో పాటు అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఉండేందుకు 17,850 పోలీస్ సిబ్బందిని ఏర్పాటుచేశారు. వీరితో పాటు 65 కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా విధులు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. 12 రోజుల పాటు జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా ఇరు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీ చేస్తున్న అభ్యర్ధులు నువ్వా..నేనా అంటూ హిమాచల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్.. ఇటు భాజపా తలపడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం వీరభద్రసింగ్ పోటీ చేస్తుండగా.. భాజపా సీఎం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ బరిలో ఉన్నారు.