న్యూఢిల్లీ, నవంబర్ 07 : విద్యుత్ వెలుగులకు నోచుకోని నాలుగు కోట్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా సౌభాగ్య పథకం ద్వారా వచ్చే ఏడాది డిసెంబరు కల్లా అమలులోకి తీసుకొని వచ్చేందుకు, ప్రస్తుతం ఉన్న ప్రణాళికలేంటి..? నిధులు ఎంత మేరకు అవసరం ఉంటుందో తెలియజేయాలని రాష్ట్రాలను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందు నిమిత్తం ఈ నెల 10, 11 వ తేదీల్లో జరగనున్న విద్యుత్, పునరుత్పాదక ఇంధనశాల మంత్రుల సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశం గురించే చర్చించనున్నారు. ఈ సమావేశంలో చెల్లింపు మీటర్లు, ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులు, నిరంతర (24×7) విద్యుత్తు సరఫరా అంశాలు చర్చకు రానున్నాయి. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సౌభాగ్య పథకం కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్ను రూపొందించింది.