బీజింగ్, నవంబర్ 07 : అరుణాచల్ ప్రదేశ్లో రక్షణ మంత్రి నిర్మల సీతా రామన్ పర్యటించిన౦దుకు చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద ప్రాంతంలో రక్షణ మంత్రి పర్యటించడం శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు ఏ మాత్రం ఉపకరించదని వ్యాఖ్యానించింది. చైనా సరిహద్దు వెంట ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని అన్జా జిల్లాలో సైనిక శిబిరాలను మంత్రి నిర్మలా సందర్శి౦చి రక్షణ సన్నద్ధతపై సమీక్షించారు. ఈ పర్యటనను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యుంగ్ తప్పుబట్టారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం చైనాతో భారత్ కలిసి పని చేయాలని నీతి పాఠాలు బోధించారు. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ లో భాగమని చైనా ఎప్పటి నుండో చెబుతూ వస్తోంది. కేంద్రంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు ఆ రాష్ట్రంలో పర్యటించడంపై ఎప్పటికప్పుడు చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది.