పోలవరంపై చంద్రబాబు సమీక్ష.. కొత్త టెండర్లకు పిలుపు

SMTV Desk 2017-11-07 10:45:25  Chandrababu Review on Polavaram, Call for new tenders

అమరావతి, నవంబర్ 07 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా జల వనరుల ప్రాజెక్ట్ పరిస్థితిని దృశ్యరూప పద్దతిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పురోగతి వివరాలను అధికారులు సీఎం ముందుంచారు. ఈ వారంలో స్పిల్ ఛానల్ కు సంబంధించి 50 వేల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకం పనులు పూర్తైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. వర్షాల వల్ల ముంపు తలెత్తి తవ్వకం పనులు ముందుకు సాగలేదని తెలిపారు. ఆశించిన మేర పూర్తి కాలేని పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు గాను ప్రధాన నిర్మాణ సంస్థ నుండి కొన్ని పనులను కొత్త నిర్మాణ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయడానికి ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తైన పదికి పైగా ప్రాజెక్టులను ఈ నెలలో ప్రారంభించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి తేదీలను ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.