మెదక్, నవంబర్ 6 : దైవ భక్తితో నది స్నానానికి వెళ్లారు.. కానీ దురదృష్టవశాత్తు వారు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా చిల్పచెడ్ మండలం చిట్కుల్ సమీపంలోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కార్తీక మాసం సందర్బంగా హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన కాలనీ వాసులు 30 మంది దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద చాము౦డేశ్వరి ఆలయం వద్ద ప్రసిద్ధి గాంచిన మంజీర నది తీరాన వెలిసిన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కుటుంబం అంతా నది స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులు స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి నీళ్లలో పడి కొట్టుకుపోయారు. వారిని కాపాడటానికి ఇతరులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో అధికారులకు సమాచారమివ్వగా ఫైర్ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు అక్కడకు చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. గల్లంతైన ఆ యువతులు శ్రీ విద్య(20), రోహిత(18) గా గుర్తించారు. ఎంతకీ తమ కూతుళ్ల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.