న్యూఢిల్లీ, నవంబర్ 04 : వాషింగ్టన్ లో చదివే విద్యార్ధులు, అక్కడే చదివే భారతీయ సిక్కు బాలుడిపై చేసిన దాడికి విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. వాషింగ్టన్లోని ఓ పాఠశాలలో 14ఏళ్ల సిక్కు బాలుడిపై సహ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. సిక్కు ఆచారం ప్రకారం తలపాగా ధరించి ఉన్న బాలుడిపై.. మరో బాలుడు దాడి చేశాడు. ఈ ఘటనను మరో విద్యార్థి వీడియో తీసి విద్వేషపూరిత వ్యాఖ్యలు జోడించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అయితే, మతపరమైన విద్వేషం కారణం కాదని, అంతకముందు విద్యార్థులు తరగతిలో గొడవపడ్డారని పాఠశాల అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన సుష్మా అక్కడి భారత దౌత్యకార్యాలయ అధికారులను పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా ఆమె కోరారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా తెలియజేస్తూ "సిక్కు బాలుడిపై దాడి జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయాల్సిందిగా అక్కడి అధికారులను కోరాను". అని సుష్మా ట్వీట్ చేశారు.