ముంబై, నవంబర్ 02 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ప్రకటించింది. నవంబర్ 1 నుంచి కొత్త వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటన వెల్లడవ్వడంతో, అన్నింటిపైనా 5 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎంసీఎల్ఆర్( మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్) కింద ఉన్న రుణాలపై ఇప్పటి వరకు ఏడాదికి 8%వడ్డీ రేటు ఉండగా దాన్ని 7.95%కి కుదించింది. అదే విధంగా వివిధ కాల వ్యవధితో తీసుకునే రుణాలపై 0.05 శాతం వడ్డీని తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీని (0.05శాతం) 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.30శాతానికి ఇవ్వనుంది. వాహన రుణాలపై వడ్డీని 8.75శాతం నుంచి 8.70శాతానికి తగ్గించింది. తాజా రేట్లు కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. పది నెలల వ్యవధిలో ఎస్బీఐ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి.