న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం పలు సంక్షేమ పథకాల నుండి మొదలుకొని మొబైల్ సిమ్ కార్డు వరకు ప్రతీది ఆధార్ తో జత చేయడం తప్పనిసరి అయింది. అయితే పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భాజపా రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి ఈ విషయంపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఆధార్ ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దీనిపై ప్రధాని మోదీకి త్వరలో ఒక లేఖ రాస్తాను" అంటూ ట్విట్ చేశారు. కాగా ఈ నెలాఖరు నుండి ఆధార్ కు సంబంధించి విచారణ ప్రారంభం కానుంది.