చెన్నై, అక్టోబర్ 31 : "అర్జున్" సినిమాలో బ్లూటూత్ కనెక్ట్ చేసి సమాధానాలను కాపీ చేసి రాసే సన్నివేశం గుర్తుందా..! అచ్చం అలాంటి సన్నివేశమే ఇక్కడ జరిగింది. హైటెక్ మాస్ కాపింగ్ చేస్తూ ఏకంగా ఓ ఐపీఎస్ ఆఫీసర్ పట్టుబడ్డాడు. అది సాదాసీదా పరీక్ష కాదు.. ఏకంగా యూపీఎస్సీ పరీక్ష. అసలు జరిగిందేమిటంటే.. సఫీర్ కరీం 2014 వ సంవత్సరంలో ఐపీఎస్ ను సాధించాడు. కాని ఐఏఎస్ నేగ్గాలన్నది అతని లక్ష్యం. ఎన్నిసార్లు పరీక్ష రాసిన యూపీఎస్సీ రాకపోవడంతో టెక్నాలజీని ఉపయోగించి డాట్ నెట్ సహాయంతో ఒక మైక్రోఫోన్ కెమెరాను తెప్పించాడు. అతి తెలివిగా కాపీయింగ్ కు పాల్పడ్డాడు. సఫీర్ ఈ ఏడాది జూన్ లో జరిగిన యూపీఎస్సీ ప్రీలిమ్స్ పరీక్ష రాశాడు. ఈ క్రమంలో అతను పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పరీక్ష పత్రాన్ని తన గుండెలకు ఎదురుగా చూపించుకుంటారు. ఆ సమయంలో అతని ఛాతికి అమర్చుకున్న కెమెరా ఆ ప్రశ్నా పత్రాన్ని స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ అయిన పేపర్ గూగుల్ డ్రైవ్ ద్వారా పరీక్షా కేంద్రం బయట ఉన్న వ్యక్తికి చేరుతుంది. దీంతో అవతలి వ్యక్తి బ్లూటూత్ సహాయంతో తన వాయిస్ ద్వారా సమాధానాలు చెప్తారు. ఈ ప్రయోగాన్ని మొదట తన సోదరిపైన ప్రయోగించిన ఆయన ఈ యూపీఎస్సీకి తానూ ప్రయత్నించాడు. ఇలాగే సఫీర్ తన భార్యకు డ్రైవ్ ద్వారా పంపగా జాయిస్ వాటిని చూసి సమాధానాలు చెప్పింది. ఇలా ప్రీలిమ్స్ లో నెగ్గిన సఫీర్ గత శనివారం మెయిన్స్ పరీక్ష కూడా ఇదే తరహాలో రాస్తుండగా కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో చెన్నై పోలీస్ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇతనికి లా ఎక్సలెన్సీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాంబాబు సహకారం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఇలా చేయడం గమనార్హం.