అమరావతి, అక్టోబర్ 18 : పోలవరం ప్రాజెక్టుకు కొత్త టెండర్లు పిలవడానికి, పాత గుత్తేదారులను మార్చడానికి సుముఖంగా లేమంటూ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనతో ఆంధ్రపదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. అమెరికా పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకుని మరి నాగపూర్ వెళ్లి గడ్కరీతో సమావేశమయ్యారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఐదు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఇదే అంశంపై 24న ఢిల్లీలో మరో మారు భేటీ జరగనుంది. మళ్లీ ట్రెండర్లను పిలిచి కొత్త గుత్తేదారులకు అప్పగించాలా, పనుల వేగం పెంపునకు వేరే ప్రత్యామ్నాయాలు చూడాలా అన్నది ఆ రోజు తేలనుంది.