విజయవాడ, అక్టోబర్ 18 : విజయవాడలోని కేశినేని భవనంలో పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.... రాబోయే రోజుల్లో విశాఖ తరహాలో విజయవాడ నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నవంబర్ లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో సమన్వయ సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని తెలియజేశారు. ఈ సదస్సులో ప్రజాప్రతినిధులు, రేషన్ లో ఇచ్చే సరుకులు పెంచమని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని కేంద్రానికి తెలియపరచామని, త్వరలో సరకులు పెంచేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి ప్రజాప్రతినిధులకు తెలిపారు. నియోజక వర్గంలో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్, పార్లమెంట్ ఇన్ చార్జ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.