హైదరాబాద్, జూన్ 07 : యాదాద్రి గర్భ గుడి పనులు జనవరి నాటికి పూర్తి చేసి బ్రహ్మోత్సవాల సమయానికి స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని రాష్ట్రదేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్రహోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మంగళవారం యాదాద్రి ఆలయ విస్తరణకు పనులను పరిశీలించేందుకు వచ్చిన వైటీడీఏ, ఆలయ అధికారులు, స్థపతులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడాతూ యాదాద్రి గర్భ గుడి పనులు డిసెంబర్ లోగా 80 శాతం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పనుల్లో నిమగ్నమై నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ల ను ఆదేశించారు. ఇక నుంచి యాదాద్రికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ పథకాన్ని అనుసంధానం చేయటంతో పాటు మరే ఇతర సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు స్వష్టం చేశారు. అలానే ఆలయ విస్తరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులకు ఆలయ ఈఓ గీత ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.