హైదరాబాద్, అక్టోబర్ 16: సీనియర్ పాత్రికేయుడు మామిడాల రాఘవేంద్ర (53) అనారోగ్యంతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... మామిడాల రాఘవేంద్ర వార్త దినపత్రికలో పనిచేసేవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మెదక్, సంగారెడ్డి, భువనగిరి, మహబూబ్ నగర్, నల్గొండ, గద్వాల, కోదాడ లలో కూడా వివిధ పత్రికల్లో పనిచేశారు. వార్త దినపత్రిక ప్రారంభం నుండి స్పోర్ట్స్, సెంట్రల్ డెస్క్, స్టేట్ బ్యూరో తదితర విభాగాల్లో సీనియర్ రిపోర్టర్ గా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. అయితే గత వారం రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతున్న ఆయన, ఆదివారం హైదరాబాద్ నాంపల్లి లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాఘవేంద్ర మృతి పట్ల, ఆయన కుటుంబానికి వార్త దినపత్రిక యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ది ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు వి వీరాంజనేయులు, ది జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ వి వి రఘుబాబు, ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.