పాట్నా, అక్టోబర్ 14 : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం బీహార్లో ప్రధాని పర్యటించారు. పట్నా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ప్రతి రాష్ట్రంలో బిహార్ నుంచి వచ్చిన ఐఏఎస్లు ఉన్నారని మోదీ తెలిపారు. పట్నా వర్సిటీలో చదివి ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, బిహార్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టుబడి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా పట్నా వర్సిటీకి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మోదీకి విజ్ఞప్తి చేశారు. 2022 నాటికి బిహార్ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని మోదీ చెప్పారు. దేశ విద్యా విధానంలో మార్పులు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దేశ నిర్మాణంలో పాల్గొన్న అనేక మంది పట్నా విశ్వవిద్యాలయం నుంచి వచ్చినవారేనన్నారు.