హైదరాబాద్, అక్టోబర్ 11: భారత దేశం ఎన్నో విషయాల్లో అగ్రస్థానంలో ఉన్న ఒక్క మందుల ఉత్పత్తిలో మాత్రం మనం వెనకబడి ఉన్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా ఔషధాల తయారీ అభివృద్ధి పై హెచ్ఐసీసీలో ఐ-తెలంగాణ 2017 భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...మన దేశంలోకి చైనా, యూరప్, అమెరికా నుంచి మందులు దిగుమతి అవుతున్నాయని.. ఎక్కువగా ముడిసరకు దిగుమతులపైనే మనం ఆధారపడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో దేశీయంగా ఔషధాల తయారీని మనం అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి లభిస్తుందని చెప్పారు. గతంలో వివిధ ప్రాంతాల్లో ఫార్మాసిటీలు ఉండటం వల్ల ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరిగిందని.. ఫలితంగా తక్కువ మోతాదులోనే ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం అన్నీ ఒకేచోట ఉండేలా ఫార్మా ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, ఏకకాలంలో వేల ఎకరాల ఫార్మాసిటీ పాజెక్టును చేపట్టడం సాధ్యం కాకపోవడంతో దశలవారీగా ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ పార్మాసిటీలో అన్ని ఔషధాలు లభించేలా తక్కువ వ్యయంతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా పార్కుకు సంబంధించి అన్ని పర్యావరణ అనుమతులూ కేటీఆర్ తీసుకుంటున్నట్లు వివరించారు.