అమరావతి, అక్టోబర్ 11 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ౦త్రి చంద్రబాబు నాయుడు "ఇంటింటికీ తెలుగుదేశం" అనే కార్యక్రమం అమలు తీరుపై రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలందరినీ జిల్లా పార్టీ కార్యాలయానికి పిలిపించి ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సభలో చర్చలు వాడివేడిగా సాగాయి. ఎన్నిసార్లు చెప్పినా పార్టీ నేతలందరూ సమయపాలన పాటించడం లేదని.. కొందరు వీడియో కాన్ఫరెన్స్కు ఆలస్యంగా రావడం, మరికొందరు ఎగ్గొట్టడంపైనా చంద్రబాబు సీరియస్గా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " కొంతమంది నేతలు పద్ధతి మార్చుకోవడం లేదు. ఇంకా అలానే కొనసాగితే వారిని పార్టీ నుండి మార్చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరి స్థానం పదిలం అనుకోకండి. ప్రజలందరూ విశ్వసిస్తేనే ఎవరైనా గెలిచేది. లేదంటే ఇంటి దారి పట్టాల్సి వస్తుంది. మీ కోసం నేను పార్టీని తాకట్టు పెట్టను" అని స్పష్టం చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం ఒక చక్కని అవకాశం ఎన్నికల సమయంలో నేతలందరూ అందరి ఇళ్ళకు వెళ్ళలేరు. కనీసం ఇప్పుడైనా వెళ్ళండి అప్పుడే ప్రజలందరూ మిమ్మల్ని ఆదరిస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలతో నేతలందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో మొత్తానికి చంద్రబాబు మాటలతో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.