హైదరాబాద్,అక్టోబర్ 10 : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో పాము కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే....లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్న సమయంలో రైలు తలుపు సందులో పాము ఉన్నట్లుగా గుర్తించిన ప్రయాణికులు ఒక్కసారిగా గందరగోళంగా పరుగులు తీశారు. దీంతో సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఐదో నెంబరు ప్లాట్ ఫాంపై ఆగి ఉన్న రైలు నుంచి పామును వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ముందుగా ప్రయాణికులను వేరే బోగిలోకి పంపించి, పామును బయటకు తీసేందుకు అరగంట పాటు ప్రయత్నం చేయగా, ఫలితం లేకపోవడంతో అప్పటికే ఆలస్యమైన రైలును యథావిధిగా ఫలక్ నుమాకు పంపించారు.