హైదరాబాద్, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన పార్కింగ్ పాలసీని ప్రభుత్వం తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్కింగ్ ప్రదేశాల్ని ఏడు కేటగిరీలుగా విభజించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అధిక వాహనాల స్థానాలు గల ప్రదేశాల్లో ప్రయోగాత్మకంగా నూతన పార్కింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దశల వారిగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు ఈ విధానం విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. పార్కింగ్ కోసం ముందుకొచ్చే భవనాలు, ఖాళీ ప్రదేశాలకు నిబంధన సడలింపుతో పాటు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, మెట్రో రైలు అధికారులు, పోలీసు కమిషనర్లతో ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. డిసెంబరు నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ఆయన వెల్లడించారు.