హైదరాబాద్, అక్టోబర్ 9 : తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఆయన పార్టీల పొత్తు గురించి ఓ స్పష్టతనిచ్చారు. సింగరేణి ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలను ఆ పార్టీ కార్యకర్తలు ఆయనకు వివరించారు. అనంతరం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి విశ్లేషించి నేతలకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్ఠానికి చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలకు ఒక ప్రణాళికలను రూపొందించాలన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతనంగా ఈ నెల 12 న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి సూచించారు. కాగా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు గురించి చంద్రబాబు ఆరా తీశారు. గవర్నర్ పదవి గురించి కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందించలేదని తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పార్టీ నేతలు పెద్దిరెడ్డి, నామా నాగేశ్వరరావు, ఆర్. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.