అమరావతి, అక్టోబర్ 8 : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉన్న ఏపీ ప్రభుత్వం తాజాగా సరికొత్త నిర్ణయానికి నాంది పలికింది. వాహనదారులకు లైసెన్స్ కోసం ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇక నుండి ఆర్టీయే కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే ఎల్ఎల్ఆర్ పరీక్షలు రాసే ఏర్పాట్లు చేయనుంది. ఇందుకోసం త్వరలోనే అనుమతులు రానున్నాయని, దీని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విషయమై తిరుపతి ఆర్టీయే వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు సమయ వేళలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష నిమిత్తం కంప్యూటర్లను తామే సమకూరుస్తామని, ఈ పరీక్ష నిర్వహించేందుకు ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని కంప్యూటర్ ల్యాబ్ లను పరిశీలించినట్లు తెలిపారు.