హైదరాబాద్, అక్టోబర్ 8: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి స్నేహితులయ్యారు. స్నేహితురాలి మరణం తట్టుకోలేక మరో స్నేహితురాలు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నల్గొండకు చెందిన నవీన, తిరుమలగిరికి చెందిన మాధవి లు ఎనిమిదేళ్ల నుండి స్నేహం చేస్తూ ప్రాణ స్నేహితులుగా మారారు. ఇద్దరు కలిసి పోటాపోటీగా చదివి కానిస్టేబుల్ కోర్సులను పూర్తి చేశారు. ఇందులో మాధవి నల్గొండ జిల్లా వేములపల్లిలో కానిస్టేబుల్ వృత్తి కొనసాగిస్తుండగా, శనివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాను ప్రేమ విఫలం కారణ౦గానే చనిపోతున్నానని డైరీలో రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైన నవీన ఈరోజు రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీసు అకాడమీ వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఇద్దరి మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి