హైదరాబాద్, అక్టోబర్ 08 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం నుంచి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. సుల్తానాబాద్ సమీపంలోని నల్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజం హయంలో నిర్మించిన నల్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణ కాల్వల మర మత్తులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 24.14 లక్షలు మంజూరు చేసింది. అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అంతకుముందు గోసాయి పల్లిలో రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. నారాయణఖేడ్ నియోజక వర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 11న సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్, జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 12న సూర్యాపేటలోను ఆయా నిర్మాణాలకు భూమిపూజ చేస్తారు. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కాకతీయ మెగా టెక్స్ టైల్స్ శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరారైంది. అలాగే ఈ నెల 20వ తేదిన వరంగల్ గ్రామీణ మండలంలోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల మధ్య కాకతీయ మెగా జౌళి పార్కుకు కూడా పూజ నిర్వహించనున్నారు.